ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకున్న క్షౌరశాలలు, లాండ్రీషాప్ లు, దోభి ఘాట్ ల వారు తమ దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు సమయంలో కొందరు కొన్ని పొరబాట్లు చేయడంతో సరిదిద్దుకోవడానికి ఈ అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. క్షౌరశాలలు, లాండ్రీషాప్ లు, దోభి ఘాట్ లకు ప్రభుత్వం ఉచితంగా నెలకు 250 యూనిట్ల విద్యుత్ అందించే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. యు.ఎస్.సి. నంబర్, డిస్కం సెలక్షన్, విద్యుత్ బిల్లును స్కాన్ కాపీ అప్లోడ్ చేయడంలో, సెల్ ఫోన్ నంబర్ నమోదు
చేయడంలో తప్పులు జరిగినట్లయితే వాటిని సవరించుకోవడానికి ఈ అవకాశం కల్పించామని కె.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తప్పులు జరిగినట్లుగా అనేక మంది ఓ.బి.ఎం.ఎం.ఎన్.కి మెయిల్స్ ద్వారా తెలియజేసి సరి చేయుటకు అనుమతి కోరగా ఎడిట్ ఆప్షన్ను అందించడం జరిగిందని, ఈ నెల 23వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.