కరోనా వ్యాప్తి చెందుతుందని చాలా మందికి ముందే తెలుసునని విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల నిఘా సంస్థలు దీన్ని ముందే అంచనా వేశాయని అతను వెల్లడించాడు.
కరోనా వ్యాప్తి నియంత్రణను అడ్డు పెట్టుకుని చాలా దేశాలు పౌరుల హక్కులను కాలరాస్తున్నాయని, ఈ పరిస్థితిని చాలా కాలం కొనసాగించే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. ఇక అంతర్జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ విషయాలను చెప్పాడు.
చాలా దేశాలు కరోనా బూచిని చూపించి ప్రజల జీవితాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ 19 వ్యాప్తిని పర్యవేక్షించడానికి అన్ని దేశాలలో హైటెక్ వ్యవస్థలు ఏర్పాటు చేశారని, ఇది కోవిడ్ ముప్పు తప్పించడానికే అయినప్పటికీ తమ దేశంలోని పౌరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా దేశాలు కోవిడ్ను ఎదుర్కోవడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవు అంటూ కొత్త చట్టాలు, నియమ నిబంధనలను ప్రవేశపెట్టాయని కూడా ఆయన అన్నారు. కోవిడ్ 19 పూర్తిగా పోయిన తర్వాత కూడా మానవ హక్కుల ఉల్లంఘన, గోప్యత ఉల్లంఘనలు కొనసాగవచ్చని స్నోడెన్ అన్నారు.