ఇప్పటికే రెండు విడతల్లో 40మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన అధికార వైసీపీ ఇంకొన్ని గంటల్లో 29మందితో మరో జాబితాను రిలీజ్ చేయనుంది. దీనిపై పలువురు నేతలతో చర్చించిన సీఎం జగన్ భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. క్యాంప్ ఆఫీసుకు నేతలు క్యూ కట్టారు. ఈ లిస్టులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మలూరి జయరాం, ఎంపీలు సత్యవతి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. తోట త్రిమూర్తులు, ద్వారంపూడి, అయోధ్యరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు కూడా ముఖ్యమంత్రిని కలిశారు.
అధిష్ఠానం నిర్ణయంపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొందరు తమదారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈసారి ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సడెన్గా స్వరం మార్చారు. తాను జగన్ను ఒక్క మాటా అనలేదనీ… కేవలం అధికారుల తీరుపైనే తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమన్నారు ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగం సురేష్.