విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు విద్యుత్ భవనం ప్రాంగణంలో గురువారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జేఏసీ డిస్కౌంట్ కన్వీనర్ భూక్య నాగేశ్వరావు, జిల్లా చైర్మన్ ఎం రమేష్ మాట్లాడుతూ ఉద్యోగులందరినీ ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ కు మార్చి పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని, పరిమితిలేని మెడికల్ పాలసీ ఇవ్వాలని, ఏపీ ట్రాన్స్కో లో సబ్ స్టేషన్ ఆటోమేషన్ ఆపాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021 సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సంస్థలను ప్రభుత్వ సంస్థలు గానే కొనసాగించాలన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. జేఏసీ కో కన్వీనర్ తురగా రామకృష్ణ, నాయకులు రాము రాధాకృష్ణ ఆర్ భీమేశ్వరరావు రఘుబాబు అప్పారావు తదితరులు పాల్గొన్నారు