ఉపాధి హామీ పని చేసిన కార్మికులకు బిల్లులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా దరిశి మండలం లోని MDO ఆఫీసు వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ పని చేసిన కార్మికులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలలో కార్మికులకు మళ్లీ వెంటనే పని కల్పించాలని ఆయన కోరారు. అదే విధంగా రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలని, వేసవి అలవెన్స్ అమలు చేయాలని కోరారు. పనిముట్లు కోసం ఒక్కొక్క దానికి ఇస్తున్న రెండు రూపాయలు రద్దు చేయడం అన్యాయమని ఆయన తెలిపారు.
10 లక్షల భీమా పధకం అమలు చేయాలని, సంవత్సరం లో 200 రోజులకు పని దినాలు పెంచాలని, రోజుకు 600 రూపాయలు కూలి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కూలీలు , ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.