ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు పోరాడి జైలు జీవితం గడిపి నేడు వృద్ధాప్య దశలో ఇబ్బందులు పడుతున్న 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులమైన మమ్ములను తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలోనైన ఆదరించాలని ఆ సంఘం
జిల్లా అధ్యక్షులు అర్వపల్లి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1969 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసి సర్వం కోల్పోయి
వృద్ధాప్య దశలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో 50మందిని 1969 ఉద్యమకారులుగా గుర్తించి ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా సన్మానం చేశారని గుర్తు చేశారు. నాటి నుండి
నేటి వరకు ప్రభుత్వపరంగా మాకు ఎటువంటి సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2 నుండి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తొలి ఉద్యమకారులుగా ఉన్న మాకు పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ లు,
రైలు బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య రక్షణ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోయ వెంకటనారాయణ, కల్వకుంట్ల హనుమంతరావు, కొండ మనోహర్,
గట్టు మోహన్ రావు, పసుపులేటి కృష్ణమూర్తి, ప్రకాష్ రావు, నరసయ్య, కూరపాటి కృష్ణమూర్తి, తప్సీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.