ఇరాన్ జనరల్ ఖాసిం సోలెమని ని అమెరికా అంతం చేయడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ పరిణామం ముడి చమురు మార్కెట్ను మండిస్తోంది. దాడి జరగడానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ ముడి చమురు ధర 68 డాలర్లుగా ఉంది.
2019 సెప్టెంబర్ నుంచి ఈ ధర కొనసాగుతోంది. అయితే దాడుల అనంతరం 70 డాలర్లకు చేరింది. సహజంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఇది భారం అవుతుంది. ముడి చమురు దిగుమతుల్లో భారత్ కు ఇరాన్ నుంచే 80 శాతం వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఆ భారం భారత ఆర్థికవ్యవస్థ పైన పడనుంది. ఫలితంగా ఎక్సైజ్ డ్యూటీలు, రిటైల్ ఆయిల్ ధరలు తగ్గించాలని ఒత్తిడి వచ్చే ప్రమాదముంది.
రెవెన్యూ తగ్గిపోయే పరిస్థితులు భారత ద్రవ్యలోటు పైనా ప్రభావం చూపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2019-20వ సంవత్సరానికి భారత్ ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉంది. టాక్స్ వసూళ్లు తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరే అవకాశం లేకపోవడంతో మరిన్ని సమస్యలు తప్పదని తెలుస్తోంది.