జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర పై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సూచనల మేరకు జనవరి 25వ తేదీన ఉదయం 10 గంటలకు తాలూకా స్థాయిలో ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ పోటీలలో ప్రతి ఉన్నత పాఠశాల నుండి తరగతితో మీడియం తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులను తాలూకా స్థాయి పోటీలకు పంపాలని డిఇఓ సూచించారు.
నాగర్ కర్నూల్ తాలూకాలోని విద్యార్థులకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ నందు, కొల్లాపూర్ తాలూకాలోని విద్యార్థులకు జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల కొల్లాపూర్ నందు, అచ్చంపేట తాలూకా విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అచ్చంపేట నందు, కల్వకుర్తి తాలూకా విద్యార్థులకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కల్వకుర్తి నందు పోటీలు నిర్వహించబడునని తెలిపారు.