వసంత పంచమి వేడుకలు నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీజ్ఞాన సరస్వతి క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి విద్యుత్ దీపాలంకరణ, క్యూలైన్లు, తడకల పందిళ్లు, పుష్పాలంకరణ ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ప్రత్యేకత పార్కింగ్ ఏర్పాట్లు సౌకర్యాలను ఆలయాధికారులు ఈఓ విజయరామారావు నేతృత్వంలో ఈపాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వసంత పంచమి మొదటి రోజైన 24వ తేదీన సరస్వతి ఆలయంలో వేకువజామున మంగళవాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. వేదస్వస్తి,చండి మహావిద్యా పారాయణాలు వైదిక సిబ్బంది నిర్వహిస్తారు. ఉత్సవ సంకల్పము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అగ్నిస్థాపన మండపారాధన అనంతరం నవచండీ సహిత మహా విద్యాహోమం తదుపరి ప్రదోష కాల చతుషష్ఠి పూజలు నిర్వహించబడతాయి.
వసంత పంచమి 02వ రోజు అయిన 25వ తేదీన యధావిధిగా స్థాపిత దేవతా హెూమముతో పాటు మహాపూజలను వైదిక బృందం నిర్వహిస్తారు.
వసంత పంచమి 26వ తేదీన శ్రీపంచమి రోజు ఉ॥7-00 గం.లకు తెల్లవారుజాము మంగళ వాయిద్య సేవ, గురుప్రార్థన గణపతి పూజలతో అభిషేకం కార్యక్రమాలు నిర్వహించి ఉ.3గం.ల తెల్లవారు జాము నుండి ప్రత్యేక అక్షరాభ్యాసానికి భక్తులను అనుమతిస్తారు.
తదుపరి ఉ॥7-00 గం.ల నుండి చండీ మహా విద్యా హోమము, బలిప్రదానము, పూర్ణాహుతి కార్యక్రమాలను స్థానాచార్య ఆధ్వర్యంలో వైదికులు నిర్వహిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్య అతిథులుగా ప్రముఖులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి ఈ సందర్భంగా ఉ॥ 8-00గంటలకు పట్టు వస్త్రములను సమర్పిస్తారు. సాయంత్రం 6-30 గంటలకు మంగళ హారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ గావించి ఆలయ అధికారులు వైదికలు కలిసి వసంత పంచమి ఉత్సవ పరిసమాప్తిని చేస్తారు.
వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజనునిర్వహించుకోవడం సహేతుకమని భక్తులు భావిస్తారు. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని పూజించడం విశేష ఫలప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 03సంవత్సరాల నుండి 05సంవత్సరాల లోపు చిన్నారులకు అక్షరాభ్యాసం గావించి పాఠశాలలో చేర్చితే మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన రాష్ట్రం నలుమూలలనుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా భారీగా భక్తులు తరలిరావటంతో పంచమి రోజున బాసర కిటకిటలాడుతోంది. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారు . ఈపాటికి ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మంచినీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు పండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఉచిత అన్నప్రసాదం, వైద్యసౌకర్యం, ఉచిత బస్సు సౌకర్యాన్ని బాసర ఆలయం తరుపున అధికారులు కల్పించడం కల్పిస్తారు.
సత్త్వరజస్తమో గుణాలను బట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా భక్తులు కీర్తిస్తారు. ఈ ముగ్గురు అమ్మలు బాసరలో కొలువై ఉండడం బాసర క్షేత్రం ప్రత్యేకం.
వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు(జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, మన సంప్రదాయం స్ఫూర్తికి నిదర్శనం. సరస్వతి మహాభాగే విద్యా కమల లోచని విద్యా రూప విశాలాక్షి సర్వవిద్యా ప్రదేహిమే. జ్ఞానము, వివేకము, దూరదర్శిత్వము, బుద్ధికుశలత, శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. అటువంటి అమ్మవారిని వసంత పంచమి సందర్భంగా దర్శనం చేసుకున్నట్లయితే సకల కోరికలు ఆ తల్లి నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.