రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని దోర్నాల మండల కేంద్రంలో వై.సి.పి నాయకులు సహకారoతో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రజలందరూ సామాజిక స్పృహ తో సహకరించాలన్నారు. కరోనా వైరస్ ప్రభావoతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం చూసి ఏప్రిల్ నెలలో 3 సార్లు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.
ఏప్రిల్1 తేదిన మొదటి విడతగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 5 కీలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు వంతున పంపిణీ చేశామన్నారు. రెండవ విడత నేటి నుంచి ఇస్తామని ఆయన అన్నారు. మూడవ విడత ఈ నెల29 వ తేదీ నుంచి ఉంటుందని అన్నారు.
పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు ఇస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలన్నారు. ప్రాణాలను సహితం లెక్కచేయకుండా సేవలను అందిస్తోన్న రెవెన్యూ, పోలీస్,వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య కార్మికులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో దోర్నాల వై.సి.పి నాయకులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, తసీల్దార్లు హనుమంతరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ షేక్. మజీద్, కాస రఘునాధ్ రెడ్డి వై.సి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.