కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు చేయూత ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళ్ రావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ లో పోలీసులకు, జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ సిబ్బంది కుటుంబాలకు ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ తో కలిసి కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కు ముఖ్యంగా పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఇండ్లలోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి యూసుఫ్ రీజియన్ కాలనీ చైర్మన్ సత్యనారాయణ, ఎస్ ఆర్ నగర్ సిఐ మురళి, డీసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.