పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద అన్నారు. బుధవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున రోడ్ల వెంట, ప్రభుత్వ కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నదని తెలిపారు.
ఇండ్లలో సైతం పచ్చదనం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని చెప్పారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని ఆమె తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను హరిత వనాలుగా తీర్చిదిద్దడం లక్ధ్యంగా మొక్కలు పెద్ద ఎత్తున నాటుతున్నామని ఆమె తెలిపారు.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పచ్చదనం పెంపొందించేలా తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, ఎస్.ఐ. గుత్తా వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సతీష్, రాము, షకీల్, కిరణ్, లతీఫ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.