హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బిజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. బిజేపీకి అనుకూలంగా మారడం కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. దళిత అభ్యర్థులను బరిలోకి దింపేతే దళిత ఓట్లు చీల్చవచ్చనే దిగజారుడు రాజకీయాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు.
బిజేపీ పార్టీ సైతం ఇతర దళిత నేతలను హుజూరాబాద్లో పోటీ చేయించాలని చూస్తున్నదని, దీనివల్ల తమ అభ్యర్థి ఈటల రాజేందర్కు అనుకూలత ఏర్పడుతుందనే భ్రమలో ఉన్నదని విమర్శించారు. దళితబంధు పథకంతో దళితులంతా టీఆర్ఎస్ వైపే నిలవడం ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక కుట్రలు, కుమ్మక్కులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
ప్రధాన నరేంద్ర మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్ , గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశ్యంతో ఈటల రాజేందర్ ప్రచార శైలి మార్చారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మోడీ ఫోటో, బిజేపీ జెండాలను దాచి కేవలం తన ఫోటోను, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఎద్దేవా చేశారు. బిజేపీ పార్టీ తరపున గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమనే విషయం అందరికీ తెలుసన్నారు.
బిజేపీ పార్టీపై విశ్వాసం ఉంటే ఇదే ఈటల రాజేందర్ వెళ్లి మోడీ దగ్గర వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా అంటూ ప్రశ్నించారు. ఈటల ఎత్తుగడలకు మోసపోయే పరిస్థితి హుజూరాబాద్లో లేదన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటిందని, అక్కడ బిజేపీకి ఓటు వేస్తే వచ్చే ఏడాదిలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ.200 దాటడం ఖాయమని, గ్యాస్ సిలిండర్ ధర రూ.1500 దాటుతుందని అన్నారు. మోడీ అవలంభిస్తున్న విధానాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే బలహీనంగా మారిందన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో బిజేపీ పార్టీని బండకేసి కొట్టారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. రేపు హుజూరాబాద్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వ్యక్తి లాభమా.. హుజూరాబాద్ ప్రయోజనమా..
రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనమే ముఖ్యమన్నారు. ఏడేళ్లలో మంత్రిగా ఉండి ఏమీ చేయలేని ఈటల రాజేందర్ ఇప్పుడు గెలిచినా చేసేదేమీ ఉండదన్నారు.
ఆత్మగౌరవం పేరుచెప్పి గడియారాలు, కుక్కర్లు, కుట్టుమిషన్లు, వెండి కుంకుమ భరిణలు, యువతకు సెల్ఫోన్లు పంచడమే పనిగా పెట్టుకున్నారని, ఈ విషయం హుజూరాబాద్లో ఎవరిని అడిగినా చెబుతారని ఆరోపించారు. ఆయన పంపకాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈటల రాజేందర్ తన సొంతంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో చేసిందేమీ లేదని, అక్కడ జరిగిన అభివృద్ధి, సంక్షేమం అంతా టీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టిందన్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఇచ్చి వచ్చారని, రేపు హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యతను కూడా ఆయనే తీసుకుంటారని చెప్పారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ మనసు గెలవాలని హరీశ్రావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ , బీజేపీ నుండి చేరిన వారు..
వరంగల్ అర్భన్ జిల్లా ఎన్ ఎస్ యూ ఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తో పాటు 50 మంది యువకులు , చిన్నపాపాయ్ పల్లి గ్రామం నుండి బీజేపీ వార్డు సభ్యులు తనుగుల అంజలి సునీల్ , శ్రీనివాస్ , తిరుపతి , యువ మోర్చా నాయకులు ప్రవీణ్ , చందర్ , దేవరాజు..