ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం తరలి వెళ్లడంపై సత్యం న్యూస్ తేదీ టైమ్ తో సహా ముందే చెప్పింది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఏప్రిల్ 29వ తేదీన సత్యం న్యూస్ ఒక ఎక్సక్లూజీవ్ వార్తను పోస్టు చేసింది. విశాఖకు తరలి వెళ్లేందుకు ముహూర్తం ఇదే అనే శీర్షికతో. ఇప్పుడు అది అక్షరాలా జరుగుతున్నది. సత్యం న్యూస్ ఆ నాడు ఇచ్చిన వార్త యథాతధంగా:
ఎక్సక్లూజీవ్: విశాఖ కు తరలివెళ్లేందుకు ముహూర్తం ఇదే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి సగం రాజధాని ని విశాఖపట్నం తరలించేందుకు ముహూర్తం ఖరారు అయింది. కరోనా రాకపోయినా, న్యాయ పరమైన సమస్యలు లేకపోయినా ఈపాటికి విశాఖకు రాజధాని తరలింపు పూర్తి అయి ఉండేది.
అయితే అనుకోని విధంగా కరోనా వైరస్ వ్యాపించడంతో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేసినట్లు అయింది. దీనికి తోడు న్యాయ పరమైన అవరోధాలు కూడా రావడంతో కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
‘‘ఆపరేషన్ కాపిటల్’’ అమలు
ఇక ఏ అడ్డంకి ఉన్నా విశాఖ పట్నానికి తరలి వెళ్లేందుకు ఆయన ముహూర్తం నిర్ణయించుకున్నారు. రాజధాని పేరుతో కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు పేరుతో ఆయన ‘‘ఆపరేషన్ కాపిటల్’’ అమలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు.
ఎవరు అభ్యంతరం తెలిపినా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇందుకోసం ముహూర్తం కూడా ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి ఈ మేరకు రాజగురువును ముహూర్తం అడిగారని ఆయన అందుకు సంబంధించిన జ్యోతిష్య లెక్కలు వేసి ముహూర్తం ఖరారు చేశారని విశ్వసనీయంగా తెలిసింది.
ముహూర్తం ఖరారు చేసిన రాజగురువు
రాజగురువు పెట్టిన ముహూర్తం ప్రకారం మే 28 ఉదయం 7.30 నిమిషాలకు ముఖ్యమంత్రి విశాఖ పట్నం తరలివెళుతున్నారు. ఆ రోజు ముహూర్తం దివ్యంగా ఉందని రాజగురువు ఆయనకు వెల్లడించారు. ఆ రోజు గురుపుష్య యోగం ఉంది.
గురుపుష్య యోగంలో ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తి అవుతుందని అంటున్నారు. గురు పుష్య యోగం చాలా అరుదుగా వచ్చే శుభ కాలం. ఇది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసి వస్తుందని రాజగురువు చెప్పారని తెలిసింది.
అమరావతిలో ఉండటం వల్ల అన్నీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నం తరలి వెళ్లిపోతే అన్ని కష్టాలూ తీరతాయని విశ్వాసం. ప్రస్తుత రాజధాని అమరావతిలో కరోనా వ్యాప్తి చెందింది. ఒక మంత్రి డ్రైవర్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో అమరావతిని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుకూడా కలుగుతున్నది.
ఎక్కడికి తరలి వెళుతున్నదో ఇప్పుడు చెబుతున్నాం
ఆపరేషన్ క్యాపిటల్ లో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కాపులుప్పాడ ప్రాంతానికి తరలిస్తున్నారు. అక్కడ బక్కన్న పాలెం లోని గ్రేహోడ్స్ కు కేటాయించిన స్థలంలోకి ముఖ్యమంత్రి కార్యాలయం మారబోతున్నది. గ్రేహోండ్స్ శిక్షణ తదితర విషయాల కోసం అక్కడ ప్రభుత్వం గతంలో 350 ఎకరాలు కేటాయించింది. ముందుగా ఈ గ్రేహోండ్స్ శిక్షణ కేంద్రాన్ని అమరావతిలోనే ఏర్పాటు చేద్దామనుకున్నారు
కానీ మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతం వైపు ఉంటే బాగుంటుదని కేంద్రం సూచించడంతో బక్కన్న పాలెంకు అప్పటి ప్రభుత్వం తరలించింది. అక్కడ ఇప్పటికే కొన్ని భవనాలను కూడా చంద్రబాబునాయుడి హయాంలోనే నిర్మాణం జరిగింది. అక్కడ ప్రస్తుతానికి 150 గ్రేహోండ్స్ పోలీసుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇప్పుడు వారినందరిని ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే అక్కడకు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ కూడా వెళ్లింది.