టెన్త్ క్లాస్ అంటే ఎంతో కీలకమైనది. అలాంటి టెన్త్ క్లాస్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు సైబర్ దరిద్రులు. టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు చెబుతూ కొందరు సామాజిక మాధ్యమాలలో టైమ్ టేబుల్ తో సహా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నట్లు టైమ్ టేబుల్ ను కూడా తయారు చేసి కింద ఎస్ఎస్ సి బోర్డు అధికారి వాడ్రేవు చిన వీరభ్రదుడి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.
రాజకీయ వార్తలు, రాజకీయ నాయకులకు సంబంధించినవే ఫోర్జరీ చేయడం చూశాం కానీ ఇప్పుడు ఏకంగా పిల్లల్ని కన్ఫ్యూజన్ కు గురి చేసే విధంగా ఇలాంటి పోస్టులు వస్తున్నాయి. వేలాది మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ టైం టేబుల్ చూసి అకస్మాత్తుగా పరీక్షలు పెడితే ఎలా అని మదనపడిపోయారు.
ఫోన్ లు చేసి అధికారులను అడుగుతున్నారు. ఇది సైబర్ నేరంకిందికి వస్తుందని, సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చామని వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు. ప్రభుత్వం పదో క్లాసు పరీక్షలపై ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.