పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో రూ.18 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న వంద పడకల ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మంగళవారం పరిశీలించారు. మంత్రి తో బాటు వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ యమ్. కృష్ణ బాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నివాస్, ఎపివివిపి కమిషనర్ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లుడుతూ వైద్య ఆరోగ్యశాఖకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి మూడు సంవత్సరాలలో 16 వేల కోట్ల రూ. ఖర్చు చేశారని చెప్పారు. నాడు- నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు ముస్తాబవుతున్నాయని, ఇప్పటికి వైద్యారోగ్య శాఖ ద్వారా 40,000 ఖాళీలు భర్తీ చేశామని తెలిపారు.
ఇంకా మిగిలిపోయిన వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని ఆమె చెప్పారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభించబోతున్నామని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 2440 సేవలను త్వరలో మూడువేలకు పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
చిలకలూరిపేటలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆమె అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందితో పాటు మందులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పదహారు వైద్య కళాశాలలతో పాటు అన్ని ఆసుపత్రిలో అభివృద్ధికి రు12 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా