ఫ్యామిలీ డాక్టర్ పథకం ఆరోగ్యశ్రీకి రెండో దశ అని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆమంచర్ల గ్రామంలో విలేజ్ క్లినిక్ ను, ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని గురువారం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మేలు చేశారని కొనియాడారు.
దానికి ఫ్యామిలీ డాక్టర్ పథకం కొనసాగింపు అవుతుందని, తద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దాన్ని ప్రస్తుతం ఆచరణలోకి తెచ్చి, అభివృద్ధి ఫలాలను సమాజానికి అందజేస్తున్నారని కీర్తించారు. ఇంతటి సంక్షేమం దేశంలో ఎక్కడా లేదని ప్రశంసించారు. రూరల్ నియోజకవర్గంలోని సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి ప్రసంగించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మనాద్, డి.ఎం. హెచ్.ఓ పెంచలయ్య, రూరల్ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచులు, నెల్లూరు నగర కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, స్థానికులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి నివాసంలో “మా నమ్మకం నువ్వే జగన్” పోస్టర్ను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు