పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఐస్ ఫ్యాక్టరీల నుండి విడుదల చేసిన అమ్మోనియా గ్యాస్ వల్ల పంటలు నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. పంటలు నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ముందుగా రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు నారాయణపురంలోని నష్టం జరిగిన పంటపొలాలను పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు.
ధర్నా అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణపురం లోని ఐస్ ఫ్యాక్టరీల నుండి విడుదల చేసిన గ్యాస్ వలన పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఐస్ ఫ్యాక్టరీల వ్యర్థాలు కాలుష్యం వల్ల పంటలకు నష్టం జరుగుతుందని అన్నారు. గత రెండు రోజుల క్రితం ఐస్ ఫ్యాక్టరీల నుండి గ్యాస్ విడుదల చేయడంతో నలుగురు కౌలు రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. వరి పంట పాలు పోసుకుని గింజ తయారయ్యే దశలో ఉందన్నారు. కౌలు రైతులు ఎకరాకు రూ 30 వేలకు పైగా ప్రైవేట్ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారన్నారు. వ్యవసాయ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించి జరిగిన పంట నష్టాలను అంచనా వేయాలని కోరారు. ఫ్యాక్టరీల యాజమాన్యాల నుండి ఎకరాకు రూ. 30వేలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
దళిత సేన రాష్ట్ర నాయకులు నేకూరి ఆశీర్వాదం, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాధిత కౌలు రైతులు టి.శివ నాగరాజు, తాడిగడప వెంకయ్య, గుడ్ల ఏసు, ఖండవల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.