ఈనెల 25వ తేదీ నుండి మొదలయ్యేఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీస్, విద్యా, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, పోస్ట్ ఆఫీస్, తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించే 32 కేంద్రాల వద్ద తగినంత మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేసుకొని విద్యుత్ వసతి ఇంటర్నెట్ సీసీ కెమెరాలు తప్పనిసరిగా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాలలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈనెల 25వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 7,578 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.