తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను,రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులకు ఇచ్చిన ఋణమాఫీ హామీ లక్ష రూపాయలు మాఫీ వెంటనే చేయాలని,27 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉచితంగా ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించిన పిదప చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులకు సన్నరకం వడ్లు వేయమని చెప్పి, సన్న రకం వడ్లు వేస్తేనే కొనుగోలు చేస్తానని బెదిరించి రైతులతో సన్న వడ్లు వేయించి, తీరా పంట చేతికొచ్చాక ఆ పంటను కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
భారతీయ జనతా పార్టీ పక్షాన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లను 2500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన మద్దతు ధరను కూడా అమలు చేయటం లేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ భీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలని,రైతుబంధు పథకం సకాలంలో చెల్లించాలని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం 30 వేల రూపాయల నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించి, ఇచ్చిన హామీలను వెంటనే అమలుపర్చి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు.
పత్తి, మిర్చి, వరి ,విత్తనాలు నాణ్యమైనవి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయాలని, భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు.55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి ఐదువేల పించన్ ఇస్తానని చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కోటిరెడ్డి, బాల వెంకటేశ్వర్లు, ఇంటి రవి, రామరాజు, మురళి, శ్రీనివాస రావు, సౌరమ్మ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.