కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గాజులపేట్ వాడలో కాలినడకన పర్యటించి ప్రజలు ఎవరూ కూడా తమ ఇళ్లలో నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
గాజులపేట లో ప్రతి ఇంటిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయాలని, సోడియం హైపోక్లోరైడ్ ద్రవం రోడ్లపై చల్లాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. గాజులపేట వాడ నుండి 500 మీటర్ల పరిధిలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా చూడాలని కోరారు.
కిరాణం, తదితర దుకాణాలు మూసివేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని పోలీస్ శాఖ ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బైల్ బజార్ లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించి ప్రజలు మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ,జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, అదనపు ఎస్పి వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యన్. బాలకృష్ణ, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.