తెలంగాణ లో పని చేస్తున్న ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల జీతభత్యాలను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన నేడు అసెంబ్లీలో ప్రకటించారు.
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నేడు అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయని, అందులోనూ ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని కేసీఆర్ అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, ఆర్టీసీని కాపాడుతున్నామని సిఎం స్పష్టం చేశారు. బడ్జెట్లో రూ. 3000 కోట్లు ఆర్టీసీ కోసం కేటాయించామని ఆయన తెలిపారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతాం. రవాణా శాఖ మంత్రితో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.