కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల ముఖంలో ఆనందాన్ని నింపిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు చేసిన మేలు మరచిపోలేనిదని చెబుతూ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని రైతులు ట్రాక్టర్ ఇంజన్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఇందిరా చౌక్ వరకు రైతు సోదరులతో మంగళవారం ఈ భారీ ర్యాలీ సాగింది.
ర్యాలీ అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేస్తానన్న కేసిఆర్ సంకల్పం నెరవేరిందని, కేసీఆర్ ఋణం రైతులు ఎన్నటికీ మరువలేరని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలోని రైతులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.