కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తమకు తీరని నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంపైనే ఒత్తిడి చేసిన అక్కడి రైతులు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఆందోళనలు చేపట్టడం ఆరంభించారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల రైతులు గురువారం సిరొంచ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్టు కార్డులు రాసి పంపించారు.
మేడిగడ్డ బ్యారేజీ వల్ల తీవ్రంగా నష్టపోతున్న తమను ఆదుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమకు చెల్లించాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని, ఆమరణ దీక్షలు కూడా చేపడతామని సరిహద్దు రైతులు హెచ్చరించారు.