మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ నిర్వహించాలి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ళను వీడొద్దు. కరోనా నిర్మూలనకు మనం చేస్తున్న లాక్ డౌన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సంపూర్ణ లాక్ డౌన్ మన ఐక్యతను, సహనాన్ని, పోరాట పటిమను చాటుతున్నది.
గుళ్ళు, మసీదులు, చర్చీలకు వెళ్ళడాన్ని ప్రజలు మానేయాలి. సిఎం కెసిఆర్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రజా సంక్షేమానికి ఎంతకైనా వెళతారు. ప్రజల్ని రక్షించడానికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులంతా నిరంతరం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు.
మనం వాళ్ళకి సహకరించాలి. కరోనా నిర్మూలన జరిగే వరకు కంప్లీట్ లాక్ డౌన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకుండా చూడాలి అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గం, వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని రాయపర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తిరుమలాయపల్లిలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయపర్తి వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ని స్వయంగా మంత్రి పిచికారి చేశారు.
ప్రజలకు మాస్కులు, ఉచిత బియ్యం పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా చోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు పారిశుద్ధ్యాన్ని పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ అడిషనల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.