ఉల్లి ధరలతో సామాన్య జనం అతలాకుతలం అవుతున్నారు కానీ నేను కాదు అంటున్నారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఎందుకంటే ఉల్లిపాయలు మా కుటుంబంలో ఎక్కువ తినరు అని ఆమె సమాధానం ఇస్తున్నారు. మా కుటుంబంలో ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినం అందువల్ల ఉల్లి ధరలు పెరిగినా నాకు పెద్దగా ఎఫెక్టు పడడం లేదు అని ఆమె అన్నారు.
రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఏం చర్యలు తీసుకొంటున్నారని మహారాష్ట్ర కు చెందిన ఎంపి సుప్రియా సూలే వేసిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి ఈ సమాధానం చెప్పారు. ఉల్లి ధర ప్రస్తుతం కిలో 150 రూపాయలకు చేరింది.
నిర్మాలా సీతారామన్ సమాధానం చెబుతూ ఉల్లి ని నిల్వ చేసే శాస్త్రీయ విధానం ఇప్పటి వరకూ లేదని అందువల్లే ఉల్లి ధరలను అదుపుచేయలేకపోతున్నామని తెలిపారు. ఉల్లి రైతుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీలలో చాలా సార్లు తాను సభ్యురాలిగా ఉన్నానని ఆమె తెలిపారు.
ఉల్లి ఉత్పత్తి ఒక సారి గణనీయంగా పెరిగిపోయిందని అందుకు మార్గాంతరంగా ఉల్లి ఎగుమతులకు తక్షణం అనుమతి వచ్చేలా చేసి రైతులను ఆదుకున్నామని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. ఉల్లి రైతులకు ప్రభుత్వం నేరుగా సాయం చేస్తున్నదని, మధ్య దళారీలను పూర్తిగా నిర్మూలించామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.