కామారెడ్డి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం పక్కన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్యాంప్ ఆఫీస్ పక్కన చెట్ల మధ్య ఉన్న గడ్డికి నిప్పు అంటుకుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో కలెక్టరేట్ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. పొగ ఎక్కడినుంచి వస్తుందని వెళ్లి చూడగా గడ్డి అంటుకోవడాన్ని గమనించి వెంటనే 101 కు కాల్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది.
కార్యాలయం పక్కన గార్డెనింగ్ మాదిరిగా ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలను నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు నీడనిస్తున్నాయి. చెట్ల మధ్య ఉన్న గడ్డి ఎండిపోవడంతో ఎవరో అక్కడ చెత్తను తగలబెట్టి మంటలు ఆర్పివేసినా అది పూర్తిగా ఆరిపోకపోవడంతో మంటలు చెలరేగినట్టుగా కలెక్టరేట్ ఉద్యోగులు అనుమానిస్తున్నారు.
మంటలు అలాగే చెలరేగి ఉంటే చెట్లన్నీ కాలిపోయి పెను ప్రమాదం సంభవించెదని చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఇలాగే రెండు ప్రమాదాలు జరిగినట్టుగా సిబ్బంది తెలిపారు.