నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదయింది. ఈ విషయం తెలియడంతో మండల ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏపూర్ గ్రామానికి చెందిన ఒక 60 సంవత్సరాల వ్యక్తి ముంబయి మహానగరంలో పని చేసుకుంటూ నివసిస్తున్నారు.
ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో గత 5 రోజుల క్రితం ముంబాయి నుండి స్వగ్రామం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వెల్మినేడు పిహెచ్ సి వైద్యులు గత శనివారం అతని ఇంటికి వెళ్ళి ప్రాధమిక పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా ఈ రోజు కరోనా పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి.
అతన్ని వెంటనే సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని ఇల్లు గ్రామంలో ఒంటరిగా ఉండటం, అతన్ని కలవడానికి ఎవరు రాకపోవడంతో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదం తప్పింది. స్థానిక పిహెచ్ సి వైద్యులు డాక్టర్ నర్సింహా తెలిపారు.
అతనికి భార్య ఉన్నప్పటికీ ఆమె మొదటి నుండి జాగ్రత్తలు తీసుకోవడంతో ఆమెకు కరోనా లక్షణాలు కనిపించలేదని ఆయన తెలిపారు. వైరస్ కట్టడి కి తీసుకోవాల్సిన చర్యలను ఏపూర్ లో రెట్టింపు చేస్తామని ఆయన తెలిపారు.