ఆజాది కా అమృత్ మహోత్సవ్-ఇండియా@75 వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో లోని నెహ్రూ యువ కేంద్రం ఈ రోజు ఉదయం 7.30 గంటలకు చార్మినార్ వద్ద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
నెహ్రూ యువ కేంద్ర తెలంగాణా ప్రాంతీయ కార్యాలయం చేపట్టిన ఈ పరుగును హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ముఖ్య అతిథిగా హాజరయి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్మన్ మాట్లాడుతూ, చక్కని ఆరోగ్యం కోసం పౌరులందరూ వారి రోజూవారీ జీవితంలో కనీసం 30 నిమిషాల శారీరక దారుఢ్య క్రియలను అలవాటుగా చేసుకోవాలని సూచించారు. ఈ అంశం తెలియచేయడమే ఈ పరుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా యువతతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ గీతం పాడిన తరువాత వందలాది మంది విద్యార్థులు చార్మినార్ నుండి మదీనా వరకు పరుగు సాగించారు.
సామాజిక దూర నిబంధనలను పాటిస్తూ కూడా శారీరకంగా దృఢంగా, చురుగ్గా ఉండడానికి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ లో భాగంగా , హైదరాబాద్ లోని నెహ్రూ యువ కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సుమారు 100 కు పైగా, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థల ప్రతినిధులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పరుగులో ఉత్సాహముగా పాల్గొన్నారు.
నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్, గజారావ్ భూపాల్, డీసీపి-సౌత్ జోన్, డా. ఎన్. సురేంద్ర- ముఖ్య ప్రణాళికా అధికారి, భిక్షం రెడ్డి- ఏసీపి, సుధాకర్-యువత, సంక్షేమ అధికారితో సహా పలువురు అధికారులు, ప్రముఖులు , నెహ్రూ యువ కేంద్రం అధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.