బాధ్యత పాటు ప్రజలకు భరోసానిచ్చే గొప్ప వృత్తి పోలీసు వృత్తని డీఐజి, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాద్ అన్నారు. ఫ్లాగ్ డే లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఫ్లాగ్ డే లో భాగంగా రక్తదానం చేసిన సిబ్బంది అందరినీ ఆయన అభినందించారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
సమాజ రక్షణ వీరులు నిరంతర ధీరులు ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు, ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రతి పోలీస్ అధికారి తన వృత్తికి వన్నె తీసుకువచ్చేలా విధి నిర్వహణ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్.ఐ.లు వై.వి. ప్రతాప్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, ట్రాఫిక్ సిఐ దుబ్బ అనీల్, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, రెడ్ క్రాస్ కార్యదర్శి గోలి అమరేందర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, ఆర్.ఎస్.ఐ. కళ్యాణ్ రాజ్, ఏ.ఆర్., రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.