తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నారాయణ సేవ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు.
సర్పవరం జంక్షన్ లో వృద్ధులకు పాదరక్షలు, విసనకర్రలు, మజ్జిగను పంపిణీ చేసిన వరలక్ష్మి మాట్లాడుతూ అధిక శాతం మంది వృద్ధులు ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలతో ఉంటారని వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
డీహైడ్రేషన్ కారణంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయన్నారు. రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీని నివారణకు గాను 10:00 దాటిన తర్వాత బయటకు వెళ్ళరాదు అన్నారు .పరిశుభ్రమైన నీరు తాగాలని, నూలు వస్త్రాలు ధరించాలని, నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోరాదని వరలక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు, అడబాల రత్న ప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణ రాజు, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.