సంక్రాతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. సురక్షిత ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరం. ఒక వేళ విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే ఆ పతంగుల మాంజాలు విద్యుత్ లైన్లపై, ట్రాన్సఫార్మర్లపై పడి ప్రమాదాలు, విద్యుత్ అంతరాయాలు కలిగే అవకాశం ఉంటుందని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి తెలిపారు.
క్రింద పేర్కొన్న కొద్దిపాటి సాధారణ జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగురవేసి తమ పండుగను మరింత ఆనందమయం చేసుకోగలరని TSSPDCL తమ వినియోగదారులకు, ప్రజలను కోరుతున్నది
1.విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయండి.
2.విద్యుత్ లైన్ల, ట్రాన్స్ ఫార్మర్ల, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయడం ప్రమాదకరం. ఒక వేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్ల పై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయం తో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం వున్నది.
3. కాటన్, నైలాన్, లినెన్ తో చేసిన మాంజాలను మాత్రమే వాడండి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పడు విద్యుత్ షాక్ కలిగే అవకాశం వుంది.
4. పొడి వాతావరణం లో మాత్రమే పతంగులు ఎగురవేయాలి. తడి వాతావరణం లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
5. పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడ్డప్పుడు వాటిని వదిలేయండి. ఒక వేళ వాటిని పట్టుకు లాగినప్పుడు విద్యుత్ తీగలు ఒక దానికొకటి రాసుకుని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం వున్నది.
6. బాల్కనీ/ గోడల మీద నుండి పతంగులు ఎగురవేయరాదు. ఇది ప్రమాదకరం. ప్రమాదాలు జరిగే అవకాశం వుంది.
7. పతంగులు ఎగురవేసేటప్పుడు తమ పిల్లలను గమనించగలరు. పిల్లలు తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకనివ్వొద్దు.
ఒక వేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు/మాంజాలు తెగిపడ్డట్లు ఉంటే, విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు వున్నా, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ వారి 1912 కి గాని లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి గాని లేదా సంస్థ మొబైల్ ఆప్ ద్వారా గాని లేదా సంస్థ వెబ్సైటు www. tssouthernpower.com ద్వారా తమకు తెలియజేయగలరు. విద్యుత్ శాఖ వారు వెంటనే తగు చర్యలు తీసుకుంటారు.