కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ టి పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, రాకేష్ రాజు తదితరులు ఉన్నారు. వేముల వాడపట్టణంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను పరామర్శించిన తదుపరి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గత నెల 19న స్వయంగా జిల్లా కు చెందిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 100 పడకల ఆసుపత్రిని సందర్శించి ఏప్రిల్ మాసం చివరిలో ప్రజలకు అందుబాటులోని తీసుకువస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.
వేములవాడ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో కరోనా,అనారోగ్యం కారణంగా సరైన వైద్యం అందక అనేక మంది మృతి చెందిన సంఘటనలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణాలతో పాటు ఇప్పుడు పల్లెల్లో అతివేగంగా విజృంభిస్తున్న కరోనా బారిన పడిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ లు దొరకక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్ళితే లక్షలాది రూపాయలు చెల్లించుకుని కూడా ప్రాణాలు కోల్పోతున్నా పరిస్థితి దాపురించిందని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్సగ్రెసియా ప్రకటిస్తున్నాయని అదే విధంగా తెలంగాణలో చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.