పంజాబ్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తాజాగా మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా బీజేపీలో చేరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫతేహ్ సింగ్ భజ్వా, బల్విందర్ సింగ్ లడ్డీ కూడా కమల తీర్థం పుచ్చుకున్నారు.
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో వీరందరు బీజేపీలో చేరారు. ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా. దేశ అభివృద్ధి కోసం బీజేపీ కంటే మరే ఇతర పార్టీ పనిచేయలేదన్నారాయన.
బీజేపీ భావజాలం, ఉత్తమ పని తీరుతో ప్రభావితమై బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు మోంగియా చెప్పారు. పంజాబ్ ప్రజల నుంచి మాకు పూర్తి మద్దతు లభిస్తుందని, మేం మరింత మెరుగ్గా రాణిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.