ప్రజా పాలన దరఖాస్తు ఫారాలకు వనపర్తి జిల్లాలో ఎలాంటి కొరత లేదని ప్రజలు బయట జీరాక్స్ తీయించుకోవాల్సిన అవసరం లేదని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ప్రజాపాలన రెండవ రోజయిన శుక్రవారం అదనపు కలెక్టర్ గోపాల్ పేట మండలం కర్ణమయ్య కుంట, కొత్తకోట మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ 3,11,12 లలో పర్యటించి ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో సాఫీగా జరుగుతుండటం పై అదనపు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులకు కొరత లేదని, 50 వేల దరఖాస్తు ఫారాలకు ఆర్డర్ ఇచ్చినందున ఆందోళన అవసరం లేదన్నారు.
ఉదయం గంటసేపు కొన్ని సెంటర్లల్లో ఫారాలు లేవని తమ దృష్టికి వచ్చిందని అయితే వెంటనే సంబధిత కేంద్రాలకు సరిపడినన్ని దరఖాస్తు ఫారాలు పంపించడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరు జిరాక్స్ తీయించుకోవాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. అయితే ఒక కుటుంబం నుండి ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలని, అనవసరం గా ఎక్కువ దరఖాస్తు ఫారాలు ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకోవద్దని తెలియజేశారు. సెలవు దినాల్లో తప్ప జనవరి 6వ తేదీ వరకు అభయ హస్తం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించటం, అర్హులైన ప్రతి ఒక లబ్దిదారులు దరఖాస్తు చేసుకునే విధంగా గ్రామాల్లో ఉదయం, సాయంత్రం చప్పుడు చేయించి టామ్ టామ్ చేయించాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్