బుల్లెట్ గాయాలకు లోనైన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న ఓ ర్యాలీలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన లాహోర్ లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నేత ఫవాద్ చౌదరి వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. పాకిస్థాన్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై పక్కా ప్రణాళికతోనే కాల్పులు జరిపారని గట్టిగా నమ్ముతున్నామని చౌదరి పేర్కొన్నారు. కాగా, ఇమ్రాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ ర్యాలీ పునఃప్రారంభంపై చర్చించామని, దానిపై నేడు ఓ ప్రకటన చేస్తామని చౌదరి చెప్పారు.