పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో యువకుడు యువతిపై సర్జికల్ బ్లేడ్తో విచక్షణరహితంగా దాడి చేసి హత్యచేశాడు. కృష్ణాజిల్లాకు చెందిన బీడీఎస్ విద్యార్థి తపస్వికి,సాఫ్ట్వేర్ ఉద్యోగి జ్ఞానేశ్వర్కు రెండేళ్ల కిందట సామాజిక మాధ్యమం ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.ఇటీవల ఇరువురు మధ్య మనస్పర్థలు రాగా, వేధింపులకు గురి చేయడమే కాకుండా యువతి ప్రాణాల్ని బలి తీసుకున్నాడు ప్రేమోన్మాది.గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో దారుణం చోటుచేసుకుంది. బీడీఎస్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థిని తపస్విపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు. సర్జికల్ బ్లేడ్తో యువతి గొంతు కోశాడు. తీవ్రగాయాలైన బాధితురాలు గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తపస్విపై దాడి చేసిన తర్వాత యువకుడు తన చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వి విజయవాడలోని ఓ వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతోంది.ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు ముంబయిలో ఉంటుండగా మేనత్త దగ్గర ఉంటూ కళాశాలకు వెళ్లుతోంది.ఆమెకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జ్ఞానేశ్వర్తో సామాజిక మాధ్యమంలో పరిచయమైంది.వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో ఉన్నారు.ప్రేమ విషయమై విభేదాలు రావటంతో అతడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.అయినా అతడి నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తక్కెళ్లపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి చెప్పి బాధపడింది.
తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నించింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్దే ఉంటోంది. ముగ్గురు మాట్లాడుకునే సమయంలో మరో యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ తపస్విపై సర్జికల్ బ్లేడ్తో దాడి చేశాడు. స్నేహితురాలు కేకలు వేస్తూ బయటకు వెళ్లడంతో తలుపులు మూసేసి తపస్విని ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. విచక్షణరహితంగా బ్లేడ్తో దాడి చేశాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి కొన ఊపిరితో ఉన్న తపస్విని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.