విశాఖ పట్నంలో భారీ ఎత్తున రసాయన వాయువులు విడుదల కావడంతో పెను ప్రమాదం జరిగింది. ఇప్పటికి ముగ్గురు వ్యక్తులు మరణించాగా దాదాపు రెండు వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ లో ఈ గ్యాస్ లీక్ కారణంగా ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గెడ్డ వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని కేజీహెచ్ కి తరలించారు. ఉదయం నాలుగు గంటల నుంచి ఎల్జి పాలిమర్స్ నుంచి రసాయనాలు లీక్ అవడంతో ప్రజలు ఆందోళనతో పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో పాటు చర్మం మీద బొబ్బులు, మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
విషవాయువు కారణంగా కడుపులో మంట
లాక్ డౌన్లోడ్ కారణంగా మూతబడిన ఎల్జి పాలిమర్స్ కంపెనీ తిరిగి ప్రారంభించే ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందింది. చిన్నారులు, మహిళలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యారు. కడుపులో మంట తో పాటు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నారు.
వెంకటాపురం సంతోష్ పురంలో ఈ రసాయన గ్యాస్ బారిన పడినవారు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ రసాయనం వల్ల ప్రాణానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
ఆసుపత్రి పాలైన రెండు వేల మంది
శ్వాసకోశ సంబంధ ఉన్న రోగులకు మరింత ప్రమాదకరంగా తయారైంది. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనివల్ల ప్రాణాపాయం ఉండదని మంచి వైద్యం తీసుకుంటే త్వరగా కోలుకో వచ్చునని వైద్యులు చెబుతున్నారు. దాదాపు 2000 మంది పైగా అస్వస్థతకు గురైన వారిని స్థానికులు, అధికారులు అంబులెన్స్ తో పాటు ఆటోలు, కారులోనూ తమ సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం వరకు లీకేజ్ కంట్రోల్ చేసినట్లు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం చెబుతున్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అందులో ఇద్దరు వృద్ధులు, ఒక చిన్నారి ఉన్నారు.