‘‘ఏ లక్ష్యం కోసం నేను ‘మానవతా పరిమళం’ చిత్రాన్ని నిర్మించానో, ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో, సంచలన విజయంతో ఆ లక్ష్యం నెరవేరింది’ అని సీనియర్ జర్నలిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత వాశిరాజు ప్రకాశం అన్నారు. మనుషులందరూ ఒక్కటే. అందరిదీ ఒకటే కులం, ఒకటే మతం అనే ఆశయంతో ఆయన నిర్మించిన చిత్రం ‘మానవతా పరిమళం’.
ఈ సినిమా ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రయూనిట్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిర్మాత వాశిరాజు ప్రకాశం మాట్లాడుతూ, ‘దళిత కుటుంబంలో అనాథగా జన్మించిన ఓ పసిపాపను, అగ్ర శ్రేణి కులస్థులు చేరదీసి కలెక్టర్ చేయటం అనే పాయింట్తో, రాష్ట్రమంత్రి కేసీఆర్ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తెరకెక్కించిన ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించటం చాలా ఆనందంగా ఉంది.
ఇదే ఉత్సాహంతో, మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, మహ్మద్ అలీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఉన్నాం. ఇందులో భాగంగా ‘అమ్మా నాన్న దేవుళ్ళు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. జన్మించిన ప్రతి మనిషి అమ్మానాన్నలను గౌరవించడం భారతీయ ధర్మం అనే సిద్ధాంతంతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.