ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అర్బన్ లోకల్ బాడీస్ మనుచౌదరి తో కలిసి పల్లె పట్టణ ప్రగతి సన్నద్ధత పై దిశా నిర్దేశం చేశారు.
గత పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగా పని చేసి ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీ సర్పంచు, మున్సిపల్ కమిషనర్, పంచాయతి సెక్రెటరీ కి అవార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సారి పల్లె ప్రగతిలో ప్రతి గ్రామ పంచాయతీ కి ఒక క్రీడా మైదానం అర ఎకరా లేదా ఎకరం భూమిలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిపారు.
ఇందుకోసం అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానానికి అవసరమైన ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారుల సహకారంతో గుర్తించి పంచాయితీ సెక్రెటరీలు నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీల్లో తిరిగి గత పల్లె పట్టణ ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు, ఇంకా మిగిలిపోయినవి గుర్తించాల్సి ఉంటుందన్నారు.
గత పల్లె పట్టణ ప్రగతిలో ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా తెలియజేసారు. ఈ సారి సైతం పల్లె పట్టణ ప్రగతిలో ముందు తర్వాత ఫోటోలు తీసి రికార్డు తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. శ్రమదానం రెండు రోజుల పాటు నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలు పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ మను చౌదరి, రాజేష్ కుమార్, ఆర్.డి.ఓ లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా