సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నెలవైన శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి కోవెలలో సోమవారం ధనుర్మాస ఉత్సవ పర్వదిన సందర్భంగా శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూల మూర్తికి నవ కలశాలతో,వేదమంత్రాల నడుమ అర్చకులు అభిషేక పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
ప్రాతఃకాల సమయంలో స్వామివారికి పంచసూక్తలతో, పంచామృతాలతో అభిషేకించారు. భక్తుల గోవింద నామాలతో ఆద్యంతం దేవాలయ ప్రాంగణం మార్మోగింది.అనంతరం శ్రీకృష్ణ,గోదాదేవి, రామానుజ అష్టోత్తరాలు, తిరుప్పావై సేవా కాలం జరిగింది.టి.టి.డి తిరుప్పావై ప్రచారకులు ముడుంబై దామోదరచార్యులు సోమవారం నాటి పాశుర అర్ధాన్ని శ్రవణానందంగా ప్రవచించారు.స్వామి,అమ్మవార్లను తులసీ దళ మాలలు,పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి షోడశోపచారాలు నిర్వహించారు.అనంతరం ధూప,దీప, నైవేద్య,నీరాజన మహా మంత్రపుష్పం సమర్పించి,తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ దేవరం రవీందర్ రెడ్డి,కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మహిళా భక్తులు రాజ్యలక్ష్మి, ప్రమీల, నిర్మల విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్