గోదావరి వరద ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. భద్రాచలం వద్ద ఈరోజు రాత్రి 9గంటలకు ప్రమాదస్థాయి దాట వచ్చని తెలిపింది. ఈనేపథ్యంలో సహాయక చర్యల కోసం రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 0404 234 50624 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నదిలో ప్రవాహం భారీగా ఉంది.
గతంలో అత్యధికంగా వరద 56.6 అడుగుల మేర ప్రవహించిందని జలసంఘం తెలిపింది. అదికూడా సరిగ్గా (1986 ఆగస్టు 16వ తేదీ) ఇదే రోజున ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహించిందని జలసంఘం వెల్లడించింది. ఈరోజు రాత్రి 9గంటల ప్రాంతంలో ప్రమాద స్థాయి దాటవచ్చని, ఆ మేరకు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలసంఘం సూచించింది.