ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు సమర శంఖం పూరించారు. ఇప్పటికే ఉద్యమబాటలో ఉన్న ఏపి ఉద్యోగ సంఘాల జెఏసీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు నేడు సమ్మె నోటీసులిచ్చారు.
ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు చేపట్టబోయే ఆందోళనలపై సచివాలయంలో ప్రభుత్వానికి నోటీసులిచ్చినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలు, వేతనాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టానున్నామని వివరాలను వెల్లడించారు. మే 22వ తేదీ నుంచి అక్టోబర్ 31 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు.
ఈరోజు ప్రభుత్వ సచివాలయంలో ఆందోళనలకు సంబంధించిన నోటీసును కూడా ఇచ్చాం. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు, వేతనాల అంశంపై ఈ ఆందోళనలు జరగనున్నాయి. జీపీఎఫ్ విత్డ్రా ద్వారా ప్రభుత్వం నేరానికి పాల్పడింది. మా డిమాండ్లు నెరవేర్చాలని అడిగితే, ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమం చేపడతాం. ఉద్యమ కార్యచరణను ఈరోజే ప్రకటిస్తున్నాం అని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 1న సీపీఎస్ బ్లాక్ డే నిర్వహించాం. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాల వద్ద సత్యాగ్రహ ప్రదర్శన చేపడతాం. అక్టోబర్ 31న బహిరంగ సభను నిర్వహిస్తాం. ఆ తర్వాత నిరవధిక సమ్మె చేపడతాం అని సూర్య నారాయణ వెల్లడించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అతి త్వరలోనే ఉద్యమానికి సిద్ధం కాబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క అంశం మీద నిర్దిష్టమైన పరిష్కారం చూపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తమ ఆందోళనకు సంబంధించిన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మే 22న కార్యచరణ ప్రారంభమై.. అక్టోబరు 31 వరకు వివిధ దశల్లో ఆందోళన చేపట్టి.. అక్టోబరు 31వ తేదీన చలో విజయవాడకు పిలుపునిస్తామన్నారు. ఆ తర్వాత నిరవధిక సమ్మెను చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏపీ జేఏసీ అమరావతి మూడో దశ ఉద్యమం
మరోవైపు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి తరఫున రెండు దశల్లో ఉద్యమాన్ని పూర్తి చేశామని.. ఈ క్రమంలో మూడో దశ ఉద్యమ పోరాటానికి సంబంధించిన ప్రణాళికపై ఉద్యోగ సంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని చెప్పారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు పిలిచింది. ఈ భేటీలో ఏ అంశం తేలకపోవడంతో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని.. ఈ సమావేశంలో తమ ఉద్యమానికి కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతు తెలిపాయన్నారు. డిమాండ్లు సాధించే వరకు తాము నల్ల బ్యాడ్జీలు ధరించే ఉంటామని స్పష్టం చేశారు. మే 8వ తేదీన ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఉపసంహరించాలని గ్రీవెన్స్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.