పంటలు చేతికి అందివచ్చే సమయంలో నివర్ తుపాన్ బీభత్సంతో తీవ్ర నష్టం జరిగిందని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
నేడు ఆయన సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు, మామిళ్ళపల్లి, కుందుర్తి గ్రామాలలో, బల్లికురవ మండలంలోని అంబడిపుడి, గుంటుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నివర్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న, పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.
వరి, మిరప, కంది, పొగాకు, మినుము, పత్తి పంటలు అద్దంకి నియోజకవర్గంలో దాదాపుగా 5,500ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పాక్షికంగా దాదాపు6వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.
వరుసగా ఇది నాలుగో విపత్తు
ఈ ఏడాది వరుసగా ఇది నాలుగో విపత్తు, ఆగస్టులో, అక్టోబర్ లో 2విపత్తులు, ఇప్పుడీ నివర్ తుపాన్..మళ్లీ 3రోజుల్లో ఇంకో విపత్తు అంటున్నారు.. రైతులు, పేదలు భయాందోళనల్లో ఉన్నారు. ఈ ఖరీఫ్ లోనే వరుస విపత్తులతో అద్దంకి నియోజకవర్గంలో దాదాపు 12వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది.
వరుస విపత్తులతో రైతాంగం తలడిల్లుతోంది,ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది అని ఆయన అన్నారు. గత ఏడాది విపత్తు నష్టాలకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు, దారుణమైన నిర్లక్ష్యం చేస్తున్నారు, మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెదేపా హయాంలో ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులు, తుపాన్లు, భారీవర్షాలు, వరదలు, అకాల వర్షాలు, పిడుగుపాటు తదితర సమాచారం అంతా వాతావరణ శాఖ, ఇస్రో తదితర సంస్థల భాగస్వామ్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజిఎస్) ద్వారా అధ్యయనం చేసి, ఆయా శాఖలను సకాలంలో అప్రమత్తం చేసేవారని అన్నారు.
1100 కాల్ సెంటర్, పరిష్కార వేదిక ద్వారా ముందస్తు హెచ్చరికలతో నష్ట నివారణ చర్యలు చేపట్టడం జరిగేదాని ఆయన గుర్తు చేశారు. జరగబోయే శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు జరిగిన విపత్తు నష్టంపై పొలాల్లో పర్యటించి వివరాలు సేకరించి,తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.