అన్నదాతకు అండగా నిలవాలని, పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఛైర్మన్ గేదెల వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలోని వర్షాభావ పరిస్థితులు, రబీకి నీటి సరఫరా, చెరకు మద్దతు ధర, ధాన్యం కొనుగోలు ప్రక్రియ తదితర అంశాలపై, జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, బొబ్బిలి ఎంఎల్ఏ శంబంగి వెంకట చినప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
జిల్లాకు కరువు నిబంధనలు వర్తించవు
జిల్లాలో ఈ ఏడాది సుమారు 2,32,586 ఎకరాల్లో ఉబాలు జరిగాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి విటి రామారావు చెప్పారు. అయితే వర్షపాతం లోటు కారణంగా ఇప్పటికే సుమారు 9,221 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, మరో 24,332 ఎకరాల్లో ఎండిపోయేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన కరువు నిబంధనలను వివరించారు. వర్షపాతం లోటు 19 శాతం కంటే తక్కువ నమోదైనప్పుడే కరువు పరిస్థతి వర్తిస్తుందని తెలిపారు. సెప్టెంబరు 30 నాటికి జిల్లాలో 9 శాతం లోటు మాత్రమే నమోదయ్యిందని, తేమ శాతం, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నా, జిల్లాలోని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించేందుకు అవకాశాలు లేవని చెప్పారు.
అయినప్పటికీ కొద్ది రోజుల్లో జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తుందని, ఏమైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెప్పారు. సలహా మండలి ఛైర్మన్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, పండిన చోట అత్యధిక దిగుబడి వస్తుందని, మరికొన్ని చోట్ల పూర్తిగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. జెడ్పి ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పంట నష్టపోయిన రైతుల పట్ల ఉదారంగా వ్యహరించాలని కోరారు. వారికి ఎటువంటి నష్టం వాటిళ్లకుండా నిబంధనలను సడలించాలని, ఈ మేరకు మండలి తీర్మాణం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, పంట దెబ్బతిన్న ప్రాంత రైతుల ప్రయోజనాలకు విఘాతం కల్గకుండా పంటకోత నమూనాలను నిర్వహిస్తామని, రైతులకు బీమా పరిహారం వచ్చేలా చేస్తామని చెప్పారు.
చెరకు ధర నిర్ణయం వాయిదా
జిల్లాలో చెరకు పంటకు మద్దతు ధర నిర్ణయాన్ని వాయిదా వేశారు. బీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలో సుమారు 11వేల టన్నులు, ఎన్సిఎస్ పరిధిలో 90వేల టన్నులు చెరకు దిగుబడి వస్తుందని కేన్ కమిషనర్ వివరించారు. చెరకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన సంకిలి సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు చెప్పిన ధరలను జెడ్పి ఛైర్మన్, జిల్లా కలెక్టర్, ఎంఎల్ఏ శంబంగి అంగీకరించలేదు. రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా ధరలను, ఇన్సెంటివ్ను పెంచాలని కోరారు. దీనిపై వచ్చే సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలను తీసుకొని మద్దతు ధరను ఖరారు చేయాలని నిర్ణయించారు.
రబీకి నీళ్లిచ్చే పరిస్థితి లేదు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లోను దృష్టిలో పెట్టుకొని రానున్న రబీకి సాగునీటిని అందించే పరిస్థితి లేదని తోటపల్లి, మడ్డువలస, తాటిపూడి రిజర్వాయర్ల ఇంజనీర్లు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఖరీఫ్ లోనే నీళ్లు తగినంతగా ఇవ్వలేకపోయామని చెప్పారు. రబీకి నీటి విడుదల విషయంలో ముందే స్పష్టమైన ప్రకటన చేస్తే, రైతులు ప్రత్యామ్నాయ పంటలను వేసుకుంటారని సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వర్రావు కోరారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, రానున్న రోజుల్లో జిల్లా త్రాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జెడ్పి ఛైర్మన్ సూచించారు. దీనిపై వీలైనంత త్వరగా నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం
జిల్లాలో పండిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెలాఖరుకు ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. ప్రతీ వాహనానికి జిపిఎస్ ఉంటుందని, అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. కొనుగోలుకు చేస్తున్న ఏర్పాట్లను సివిల్ సప్లయిస్ డిఎం మీనాకుమారి వివరించారు. జెడ్పి ఛైర్మన్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యమంతటినీ కొనుగోలు చేయాలని, సాధారణ రకాలతోపాటు, సూపర్ ఫైన్ రకాలను కూడా తీసుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా ధాన్యం డబ్బులు చెల్లించాలని కోరారు.
రైతులకు అండగా ఉంటాం – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పి ఛైర్మన్
వర్షాభావ పరిస్థితలను చూసి ఆందోళన పడవద్దని, రైతులందరికీ అండగా ఉంటామని జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సలహా మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని చోట్ల పంటకు నష్టం వాటిల్లిందని, వారికి పరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులను ఆదుకొనే విషయంలో సీఎం జగన్ కూడా ఉదారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చెరకు రైతులకు మేలు కలిగే విధంగా మద్దతు ధరను త్వరలో నిర్ణయిస్తామన్నారు. రబీలో నీటి సరఫరాపై అన్ని శాఖల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బంధీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.