2021 – 2022 సంవత్సరానికి గాను రైతు భీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు రూ.1450 కోట్ల చెక్కును మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ సందర్భంగా మంత్రులు అన్నారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, వందశాతం పంటల కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగం ఆత్మస్థయిర్యం పెరిగిందని, సమైక్యరాష్ట్రంలో నష్టపోయిన రైతాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దికి వ్యవసాయరంగ పథకాలు నిదర్శనం అని వారన్నారు.