కరోనా వైరస్ పై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రాపు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని, విశాఖపట్నంలో కరోనా కేసు ఒక్కటీ నమోదు కాలేదని, ఎవరూ ఏ విధమైన భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విమానాశ్రయంలో తనిఖీ బృందాలు ఉన్నాయని, విదేశాలు మరియు స్వదేశీయులను తనిఖీ చేస్తారని తెలిపారు.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో కరోనా గూర్చి ఎనౌన్స్ చేస్తారని చెప్పారు. పర్యాటక ప్రాంతాలలో స్క్రీనింగ్ మిషన్ పెట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తారని, ఎస్ఇజడ్ అచ్యుతాపురం, గాజువాకలలో స్క్రీనింగ్ మిషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు.
వేరే దేశాల నుండి వచ్చే వారిని విమానాశ్రయంలో తప్పనిసరిగా తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్)లో క్వారంటైన్డ్ వార్డులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులైన విమ్స్, ఛాతి, మెంటల్, ఈఎన్ టి హాస్పిటల్స్ లో క్వారంటైన్డ్ వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గీతం, గాయిత్రి మెడికల్ కళాశాలల్లో క్వారంటైన్డ్ వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరిన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ను వినియోగించనున్నట్లు ఆయన వివరించారు. ఆర్.టి.పి.సి. మిషన్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లలో స్క్రీనింగ్ మిషన్లు ఉండాలని చెప్పారు. గ్రూపు మీటింగులు పెట్టకూడదని, పెళ్లిళ్లు, పండగలను ఇళ్ల వద్దనే చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా పై ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ బుధవారం విదేశాల నుండి విశాఖపట్నం చేరుకున్న చేరుకున్న వారికి హోం క్వారంటైన్ కు పంపడమైనదని, చైనా, ఇరాన్, ఇటలీ, తదితర 10 రిస్క్ దేశాల నుండి ఎవరైనా వచ్చినా అలాంటి వారిని తనిఖీ చేసి కరోనా లక్షణాలు లేకపోతే 15 రోజులు హోం క్వారంటైన్ లోనే ఉంచనున్నట్లు ఆయన వివరించారు.
బుధవారం వచ్చిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నారని, ఎక్కువ మంద ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆరుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారని, వారి నుండి శ్యాంపిల్స్ సేకంచడమైనదని ఆ రిపోర్టులు రావలసి ఉందని పేర్కొన్నారు. అనంతరం కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పై పాంప్లేట్ లను ఆవిష్కరిచారు. ఈ సమావేశంలో విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు, నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జివిఎంసి ఇన్ చార్జి కమీషనర్ కోటీశ్వరరావు, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమా శంకర్ గణేష్, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.