ధాన్యం, మొక్కజొన్న సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్ మిల్లులకు రవాణా అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 236 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు, ఇప్పటి వరకు 186 కేంద్రాల ద్వారా 9,743 మంది రైతుల నుండి 90,651.680 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చెందినట్లు ఆయన తెలిపారు. 84,667.440 మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధిత మిల్లులకు తరలించినట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకు 1,633 మంది రైతులకు 19 కోట్ల 88 లక్షల 55 వేల 128 లు ధాన్య మొత్తం వారి వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఆన్లైన్ నమోదులు వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. రవాణాకు వాహనాల ఏర్పాటు వెంట వెంటనే చేపట్టాలన్నారు. ధాన్య సేకరణ ఎక్కువగా జరుగుతున్న కేంద్రాల వద్దకు అవసరమైన లారీల ఏర్పాటు చేయాలన్నారు. గన్నీ బ్యాగులు అవసరమైన చోట ముందస్తుగా అందజేయాలన్నారు.
జిల్లాలో 41 మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ప్రతిపాదించి, ఇప్పటికి 31 కేంద్రాలను పారంభించినట్లు తెలిపారు. 11 కొనుగోలు కేంద్రాల్లో 751 మంది రైతుల నుండి 4,623.903 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎఫ్ఏక్యూ ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.
కేంద్రాల వద్ద రైతులు, హమాలీలకు నీడకు షామియానా, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా ప్రదేశాల్లో ధాన్యం, మొక్కజొన్నల దిగుబడిని బట్టి కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు ముందస్తుగా ఇండెంట్ చేసుకోవాలని, లారీలు వెంటనే వచ్చేలా అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులకు ఏ దశలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.