కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకొని వెంట వెంటనే మిల్లింగ్ చేసి గోదాములకు తరలించేలా పర్యవేక్షించాలని పౌర సరఫరాలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో ధాన్య కొనుగోలు, డబుల్ బెడ్రూమ్ గృహాల కేటాయింపు, జి.ఓ.నెం.58, 59 రెగ్యులరైజేషన్ చెల్లింపులపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించి, మిల్లింగ్ ఆయి గోడౌన్లకు తరలించేంత వరకు తహశీల్దారు పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజు రైస్ మిల్లులను సందర్శించి పర్యవేక్షించాలన్నారు. రైతును ఇబ్బందులు కలుగుండా తరుగు, నూక అనే ప్రసక్తే లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
నిర్మాణాలు పూర్తి చేసుకున్న రెండు పడక గదుల కేటాంపు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. గ్రామసభల్లో ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిన చిన్నారులతో తీయించాలన్నారు. వారితోనే వ వచ్చిన పేరును చదివి వినిపించాలన్నారు.
ప్రభుత్వ ఉత్వర్వునెం.58, 59 క్రింద ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వారికి 58 క్రింద పట్టాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 59 క్రింద నోటీసులు జారీచేసిన వారి నుండి పూర్తి చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం, సత్తుపల్లి ఆర్.డి.ఓలు రవీంధ్రనాద్, సూర్యనారాయణ, ఏ.ఓ శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి రాజెందర్, జిల్లా మేనేజర్ సోములు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహశీల్దార్లు తదితరుల పాల్గొన్నారు.