తనపై అక్రమ కేసులు బనాయించి, లాకప్ లో హింసించడానికి కారణమైన ఒకడు పోయాడు… మరొకడు త్వరలో పోతాడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. తన అరెస్టుకు సహకరించిన వ్యక్తులు అధికారంలో నుంచి దిగిపోగా, అసలు కారకుడు త్వరలోనే స్మాష్ అవుతాడని ఆయన అన్నారు. వాడికి 15 సీట్లకు మించి రావని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచివాడు కాబట్టి, ఆయనకు ఎక్కువ సీట్లు వచ్చాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈరోజు ఆనందంగా ఉంది. చెప్పడానికి వీలులేనంత ఆనందంగా ఉంది. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి సాధించిన అప్రహతిత విజయం ఒక కారణమైతే, తన సహచర పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి నేతృత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని 65 స్థానాలలో గెలిపించిందన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి ముందుగా చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. దేశంలో సర్వే అంచనాలకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో బిజెపి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ పోలీసుల వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు.
ఇంకొక రావు మా రాష్ట్ర దుష్మన్ తో కలిసి నా అక్రమ అరెస్టుకు సహకరించారు. నన్ను పట్టుకెళ్ళి దారుణంగా హింసించారు. మళ్లీ నా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి, నన్ను హతమార్చాలని చూశారు. రఘురామిరెడ్డి టీం సభ్యుడైన నరేందర్ రెడ్డి అనే కానిస్టేబుల్ నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా, నా రక్షణ సిబ్బంది ఆ వ్యక్తి ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా వీడియో, ఆడియో సాక్షాలు ఉన్నప్పటికీ, తెలంగాణ పోలీసులు నాపైన, నా కుమారుడిపైన రివర్స్ గా పది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, మాకు రిలీఫ్ లభించలేదు. చివరకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి తప్పులన్నీ చూస్తూనే ఉంటారు. ఆ దేవుడు, నాకు అన్యాయం చేసిన తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని సరి చేయడం జరిగింది. నా పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు. ఎంతో ఒత్తిడికి గురి చేశారు. నా కుమారుడుపై కేసులు పెట్టి, నన్ను చంపాలని చూశారు. నా రక్షణగా ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బందిపై కూడా కేసు పెట్టారు. లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. జైల్లో చంపాలని చూశారు.
కోర్టు దయవల్ల, కేంద్రంలో పెద్దాయన దయవల్ల బతికి బయటపడ్డాను. ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దయ వల్లనే ఆ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడ్డాను. భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఎవరో ఒక మనిషి రూపంలో సహాయం చేయాల్సిందే కదా అని, ఆ భగవంతుడి దయ వల్లే బతికి బయటపడ్డానని మరుగు రామకృష్ణంరాజు తెలిపారు.